భారత్ లో 5 జీ సేవలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతున్న 4 జీ కన్నా 5 జీ ద్వారా 20 రెట్లు వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అయితే, 5జీ సేవలు దేశవ్యాప్తంగా ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుంది. అంతేకాదు, 5 జీ సేవలు ప్రారంభమైన నగరాలలో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండవు.
మొదటి విడతగా దేశవ్యాప్తంగా 13 నగరాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. అవి ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, లక్నో, పుణె నగరాలు. అయితే, ఈ 13 నగరాల్లోనూ పూర్తి స్థాయిలో ఈ సేవలు ప్రారంభం కావడం లేదు.
ఈ రోజు నుంచి 8 నగరాల్లో 5జీ సర్వీసెస్ ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. దీపావళి నుంచి నాలుగు మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభిస్తామని జియో వెల్లడించింది. దీపావళి నుంచి కోల్ కతా, ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో 5 జీ సర్వీసెస్ ను రిలయన్స్ జియో ప్రారంభిస్తుంది.
దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు జియో 5 జీ సేవలు 2023 డిసెంబర్ నాటికి అందిస్తామని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఢిల్లీ, వారణాసి, ముంబై, బెంగళూరుల్లో ఈ రోజు నుంచే 5 జీ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో 5 జీ సేవలను మార్చి 2024 నాటికి అందుతాయని ఎయిర్ టెల్ వెల్లడించింది.
ఇక ఐడియా, వోడాఫోన్ మాత్రం 5 జీ సేవలు కచ్చితంగా ఎప్పుడు ప్రారంభిస్తామో వెల్లడించకుండా.. త్వరలో 5 జీ సేవలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ తెలిపింది. ‘5 జీ’ సేవలు ప్రారంభమయ్యే నగరాల్లో కూడా ఆయా నగరాల్లో పూర్తి స్థాయిలో ఆ సేవలు అందుబాటులో ఉండవు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతానికి అవి లభిస్తాయి.
మీది ఒకవేళ 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ అయితే, ఆ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులోకి రాగానే మీ ఫోన్ కు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్ లో 6 జీ సేవలు అందుబాటులోకి వస్తాయని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు.